తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి
జీవో 3ని అమలు చేసేవిధంగా కేంద్రం నుంచి మద్దతు ఇవ్వండి
మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్,
గిరిజన పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇతర పరిశోధనల సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఈ నెల 3,4 తేదీల్లో నిర్వహిస్తున్న నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాంక్లేవ్ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాద్ దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ , కార్యదర్శి క్రిస్టినా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్ రెడ్డి, సమజువాలా, రాష్ట్ర గిరిజన పరిశోధన సంస్థ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఈ సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మేము పూర్తిగా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నాం. ఏ పథకాలు అమలు చేస్తే ప్రజలకు బాగా చేరుతాయి, ఆ పథకాలు ఏ విధంగా నడిపించాలో మంచి సలహాలు ఇచ్చారు. కోవిడ్ సమయంలో కూడా మీరు రెండు, మూడు సార్లు ఫోన్ చేసి ఇక్కడి గిరిజన ప్రజలు ఏ విధంగా ఉన్నారని అడిగి, గైడ్ చేసినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ గిరిజన జనాభా 9.08 శాతం ఉన్నారు, కానీ 6.5 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు జరుగుతోంది. దీనివల్ల చాలా మంది గిరిజన విద్యార్థులు,యువత విద్యలో, ఉద్యోగాల్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఆలోచించి వీలైనంత త్వరలో ఈ రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాను. గిరిజన ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాలను స్థానికులతోనే భర్తి చేయాలని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ లో కొట్టి వేసింది. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో న్యాయ సలహా తీసుకుని జీవో నెంబర్ 3పై రిప్యూ పిటిషన్ వేశాము. దీనిని తిరిగి అమలు చేసే విధంగా కేంద్ర నుంచి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు.