న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4,
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై భర్త పరకాల ప్రభాకర్ విమర్శలు చేశారు. దేశ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు మైనస్ 23శాతంగా నమోదు కావడం ‘మన చేతుల్లో (యాక్ట్ ఆఫ్ గాడ్) లేదు’కరోనా వల్లే ఇలా జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ కామెంట్స్పై స్పందించిన ఆయన.. ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రభుత్వం సూక్ష్మ-ఆర్థిక సవాళ్లపై తగిన విధంగా స్పందించకపోవడమే అసలైన యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. కరోనా ఆ తర్వాత వచ్చిందని.. ఈ పరిస్థితిని గత అక్టోబరులోనే ఊహించాను.. కానీ ప్రభుత్వం తిరస్కరించినా.. తాజాగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో అసలు వాస్తవం తెలిసొచ్చింది అని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా (దేవుడి కోసం ఏదైనా చేయండి) దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రభాకర్ ట్వీట్ చేశారు.పరకాల ప్రభాకర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. ఆయన టీడీపీ హాయాంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ తొలగడంతో.. ఆయన కూడా విమర్శలు రావడంతో తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే బహిరంగంగా విమర్శలకు కాస్త దూరంగా ఉండే ఆయన ఏకంగా దేశ ఆర్థిక పరిస్థితి, ఇటీవల మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ ట్వీట్కు నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారో చూడాలి.