మధురై సెప్టెంబరు 04
తమిళనాడు శివకాశిలోని ఒక బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించి ఏడు మంది మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు. కడలూరు జిల్లా కట్టమన్నార్ కోయిల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో సంస్థ యజమానురాలు గాంధీమతి కుడా వున్నారు. కర్మాగారానికి అనుమతులున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో తొమ్మిది మంది వున్నారు. పేలుడు ధాటికి భవంతి కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత నెలల మార్చిలో విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడిన విషయం తెలిసిందే.