దౌత్యపరంగా సైనికపరమైన చర్చలు జరగాలి: రాజ్నాథ్ సింగ్
న్యూ ఢిల్లీ
రష్యా రాజధాని మాస్కోలో చైనా రక్షణ మంత్రి ఫెంగితో చర్చించిన తర్వాత.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. తన ట్విట్టర్ ద్వారా విషయాలను వెల్లడించారు. ఈస్ట్రన్ లడాఖ్లో శాంతి స్థాపన కోసం రెండు దేశాలు నిరంతం చర్చలు నిర్వహిస్తూ ఉండాలన్నారు. దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరగాలన్నారు. ఎల్ఏసీ వద్ద శాంతి, సామర్యం పరిఢవిల్లాలంటే చైనా తమ దళాలను ఉపసంహరించాలని, అప్పుడు ఉద్రిక్తతలు తగ్గుతాయని రాజ్నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఉన్న పరిస్థితిన బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేయాలన్నారు. రెండు వైపుల వారు ఎటువంటి చర్యలు తీసుకోరాదన్నారు. ఒకవేళ ఎవరు దూకుడుగా వ్యవహరించినా.. అప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని, దాంతో బోర్డర్ సమస్య మరింత జఠిలంగా మారుతుందని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత్తో కలిసి చైనా దళాలు ఎల్ఏసీ వద్ద నుంచి ఉపసంహరించాలని సలహా ఇచ్చారు. దీని గురించి చైనా చర్చించాలన్నారు. కీలకంగా మారిన పాన్గాంగ్ సరస్సు వద్ద నుంచి దళాలు వెనక్కి వెళ్లాలన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం ఈ చర్య చేపట్టాలని రాజ్నాథ్ సూచించారు. నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు గుర్తించాలని, దాని ద్వారానే రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి వికసిస్తుందని, ఇది ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు.. గొడవలకు దారి తీయవద్దు అని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. బోర్డర్ సమస్యను చాలా బాధ్యతాయుతంగా భారతీయ సైనిక దళాలు ఎదుర్కొన్నాయని, భారతీయ సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దు వద్ద చైనా దళాల చర్యలు సరిగా లేవని, భారీ స్థాయిలో దళాలను మోహరిస్తున్నాయని, చాలా దూకుడుగా ఆ దళాలు ప్రవర్తిస్తున్నాయని, సరిహద్దుల్ని మార్చేందుకు ఆ దళాలు ప్రయత్నిస్తున్నట్లు రాజ్నాథ్ ఆరోపించారు. ఇది ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. మాస్కో భేటీలో ఇద్దరు రక్షణ మంత్రులు పూర్తి స్థాయిలో బోర్డర్ సమస్య గురించి చర్చించారు. ఇద్దరి మధ్య 2 గంటల 20 నిమిషాల పాటు చర్చ జరిగిందన్నారు.