ముంబై సెప్టెంబర్ 10,
బాలీవుడ్ నటి కంగనారనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు యంత్రాలతో కూల్చివేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసిన కంగనా..తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పై మాటల దాడి చేశారు. త్వరలోనే తాను సీఎం ఉద్దవ్ థాక్రేపై ప్రత్యక్షంగా ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. అయోధ్య, కశ్మీర్ నేపథ్యంలో సినిమాలు తీసి త్వరలోనే థాక్రేకు గుణపాఠం చెప్తానని చురకలంటించారు.ముంబైపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా, శివసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కంగనా చండీగఢ్ నుంచి ముంబైకు చేరుకోగానే శివసేన కార్యకర్తలు కంగనా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ముంబై ఆందోళనకర వాతావరణం నెలకొంది. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.