హైదరాబాద్ సెప్టెంబర్ 13,
ప్రగతి భవన్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశమయ్యారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెచ్చిన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం సూచించారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆయన చెప్పారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. గతంలో మండలాలు, గ్రామాల్లో బాగా పని చేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించేవారు. మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలి. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారు. రెవెన్యూ యంత్రాంగం సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు-2020ను తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం విదితమే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నూతన రెవెన్యూ చట్టం ఆమోదం పొందడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.