హైదరాబాద్ సెప్టెంబర్ 13,
టీఎస్ బీపాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్ఎండీఏలో మార్పులకు సిద్ధంగా ఉండాలని ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో జరిగే కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హెచ్ఎండీలో జరగనున్న మార్పులకు ఇప్పట్నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్ అంశాలపై హెచ్ఎండీఏ మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ చేపట్టిన మౌలిక వసతుల కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించి ఉన్న జిల్లాల కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ తరహాలో అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సెల్ ద్వారా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు.