హైద్రాబాద్, సెప్టెంబర్ 14.
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంతో శాఖలో మార్పులు జరగబోతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో విధుల విషయంలో విభజన జరగనుంది. తహసీల్దారుకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకే కార్యాలయంలో రెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక తహసీల్దారు రెండు బాధత్యల్ని స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తహసీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మిగిలిన సమయం తహసీల్దారు సేవలు కొనసాగుతాయి. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నారు.కొత్త చట్టం ప్రకారం ప్రజలు కూడా తమ పనుల కోసం కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలతో ప్రోటోకాల్ విధులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయి పర్యటనలకే పరిమితమయ్యేవారు.. ఇప్పుడీ బాధ్యతలను పూర్తిగా డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం అప్పగిస్తోంది. ఏదైనా అత్యవసర సందర్భంలో మాత్రం హాజరుకావొచ్చని.. కొన్ని కార్యక్రమాలకు డిప్యూటీ తహసీల్దారే హాజరవుతారు. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది.తహసీల్దార్లకు మరోసారి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రిజిస్ట్రేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా 443 మంది తహసీల్దార్లకు 2018లో 10 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల విధానంతో పాటు చట్టాలు, సబ్రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులపై అవగాహన కల్పించారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మక శిక్షణ పొందారు. ఒకరోజు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులను తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్లీ శిక్షణ ఇవ్వనున్నారు.ఇటు రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూములను తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర భూములు, ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టం శాసనసభలో ఆమోదం పొందింది.. మండలి ఆమోదం తర్వాత గెజిట్ వెలువడుతుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్లపై స్పష్టత వస్తుందట. రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్ కార్యాలయాలు, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను అనుసంధానం చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్తో పాటు రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను అనుసంధానం చేయాలి.