హైద్రాబాద్, సెప్టెంబర్ 16
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తమకు అంబేడ్కర్ పై గౌరవం లేదని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అది వారికే చెల్లుతుందన్నారు. అంబేడ్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో అంబేడ్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ను పార్లమెంట్లో అడుగుపెట్టనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. అంబేడ్కర్కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ నేతలు.. ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేడ్కర్ ను గౌరవిస్తున్నాం కాబట్టే.. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టాం. ట్యాంక్బండ్ వద్ద 125 ఫీట్ల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టబోతున్నాం. అంబేడ్కర్ ఆశయాలను అనుసరించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుపడేది. తమ పార్టీ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.