హైదరాబాద్ సెప్టెంబర్ 16
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు నేటి వరకు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం 12 బిల్లులపై చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్, కేంద్ర విద్యుత్ చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు. ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, పోలీసు, శాసనసభ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందన్నారు. అయితే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని స్పీకర్ పోచారం ప్రకటించారు.