తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ విద్యార్ధుల పాత్ర ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించి ప్రజలకు వివరించాలని మంత్రి కోరారు. మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తామని ఇతర రాష్ట్రాలు అంటున్నాయని, రైతు బంధు పథకం త్వరలో అమలు చేయబోతున్నామన్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రెండ్రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. ఐదు బస్సుల్లో 250 మంది టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్తో పాటు 15 జిల్లాలకు తాగు, సాగునీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుందని, కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమవుతోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అద్భుతమైన ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకుందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు అంటే 10, 20 ఏళ్లు పట్టేదన్నారు. గోదావరి నదిపై 3 బ్యారేజీల ద్వారా రివర్స్ పంపింగ్ తో నీళ్లను ఎల్లంపల్లికి తెచ్చుకుంటామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు వరకు కాళేశ్వరం నీళ్లు వెళ్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. మనం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తామని చెబుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయాన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు కట్టాలంటే దాదాపు రెండు దశాబ్దాల సమయం పట్టేదన్నారు. రైతాంగానికి త్వరగా నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తున్నామని మంత్రి విద్యార్ధులకు వివరించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు, 31 జిల్లాల సమన్వయకర్తలు, పలువురు నాయకులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.