హైద్రాబాద్, సెప్టెంబర్ 22,
గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లన్ని అధ్వాన్నంగా మారాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, ఫ్లైఓవర్లు దెబ్బ తిన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. గల్లీ రోడ్లు సైతం దారుణంగా మారాయి. భారీ వర్షాలు కురిసి మధ్యలో విరామం కల్పించినా అధి కారులు పట్టించుకోవడంలేదు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 709కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించాయి. ఆ రోడ్లను మరమత్తులు చేయా ల్సిన సదరు ఏజెన్సీలదే. అయినా పట్టించుకోవడంలేదు. బల్దియా అధికారులు సైతం చూసిచూడనట్టుగా వ్యవ హరిస్తున్నారు. గ్రేటర్లో 9,103 కిలోమీటర్ల రోడ్లు ఉన్నా యి. వీటిలో బీటీరోడ్లు, సీసీ రోడ్లు, వీడీసీసీ రోడ్లు, మెటల్డ్ రోడ్లు ఉన్నాయి.అసలే వర్షాకాలం.. ఎక్కడిపడితే అక్కడ గుంతలు. రోడ్ల మధ్యలో భారీ గుంతలు పడుతున్నాయి. రాంనగర్ రోడ్డు, చిక్కడపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి, కాప్రా, మల్లాపూర్, నాచారం, హబ్సిగుడ, ఆల్వాల్, సికింద్రాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో రోడ్లన్ని పాడై పోయాయి. వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నారాయ ణగుడ ఫ్లైఓవర్పై గుంతలు పడ్డాయి. దీంతో వాహనాలు స్కిడ్ అయ్యే అవకాశాలూలేకపోలేదు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే మార్గంలోనూ రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. కోఠి, సుల్తాన్బజార్, కాచిగుడ, చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల్లోనూ రోడ్లన్ని పాడయ్యాయి.వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధలోని రోడ్లపై సుమారు 3వేల గుంతలు పడ్డాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. లెక్కలు తీస్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడంలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ట్యాంక్బండ్ నుంచి హిమాయత్నగర్, బషీర్బాగ్ వెళ్లే మార్గంలో రోడ్లపై కంకరతేలింది. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. రోడ్ల నిర్వహణ కోసం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్న పరిస్థితి మారడంలేదు.గ్రేటర్లోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులను ఐదేండ్ల నిర్వహణకు ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఎల్బీ నగర్ జోన్లో 138.71 కి.మీ, చార్మినార్ జోన్లో 100.42 కి.మీ, ఖైరతాబాద్ జోన్-1 పరిధిలో 81.56 కి.మీ, ఖైరతాబాద్ జోన్-2 పరిధిలో 90.49 కి.మీ, శేరిలింగంపల్లి జోన్లో 108.44 కి.మీ, కూకట్పల్లి జోన్లో 82.12 కి.మీ, సికింద్రాబాద్ జోన్లో 107.73 కి.మీ రహదారులు ఉన్నాయి. ఈ ఏడు ప్యాకేజీలలో ఐదేండ్ల పాటు రోడ్లు నిర్వహించేవిధంగా ఒప్పందం చేసుకున్నారు. 331కిలోమీటర్ల మేర పనులు చేశారు. మిగిలిన రోడ్లను వదిలేశారు. ఎక్కడికక్కడ గుంతలు పడ్డా పట్టించుకున్న పాపానపోలేదు. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణపై మేయర్ బొంతు రామ్మోహన్ సమావేశం నిర్వహించిన ఆదేశాలు జారీచేసిన ఫలితంలేదు. అయితే రోడ్ల నిర్వహణ గురించి జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.