YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సెల్ఫీ తీసుకుందామని నమ్మించి భార్యను నదిలోకి తోసేసినభర్త

సెల్ఫీ తీసుకుందామని నమ్మించి భార్యను నదిలోకి తోసేసినభర్త

కర్నూలు సెప్టెంబర్ 22  
సెల్ఫీ తీసుకుందామని భార్యను నమ్మించి పక్కనే ఉన్న నదిలోకి తోసేశాడు అదృష్ట వశాత్తు ఆమె బతికి బయటపడింది.వివరాల్లికి వెలితే..  హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేసే పత్తి భాస్కర్ తో కొన్నేళ్ల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి 2016లో పెళ్లితో ఇద్దరు ఒక్కటయ్యారు. కొన్నాళ్ల పాటు భార్యను బాగానే చూసుకున్న భాస్కర్‌లో కొంతకాలంగా మార్పు వచ్చింది. ఆమెను వదిలించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16న కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం మర్రిపల్లెకు భార్య రామలక్ష్మిని తీసుకుని వచ్చాడు భాస్కర్. సోమవారం(సెప్టెంబర్ 20) ఉదయం బంధువుల ఇంటికి వెళ్దామని బైక్‌పై రామలక్ష్మిని ఎక్కించుకుని బయలుదేరాడు.మార్గమధ్యలో కుందూ నది వంతెన వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ బైక్ ఆపాడు. అక్కడ ఓ సెల్ఫీ తీసుకుందామని భార్యను నమ్మించి పక్కనే ఉన్న నదిలోకి తోసేశాడు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రామలక్ష్మి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తాను కూడా బైక్‌తో సహా నదిలో దూకాడు. అయితే తనకు ఈత రావడంతో ఎలాగోలా ఒడ్డుకు చేరాడు. రామలక్ష్మి చనిపోయి ఉంటుందని ఇక అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ రామలక్ష్మి ప్రాణాలతో బయటపడటంతో అతను షాక్ తిన్నాడు. నదిలో కొట్టుకుపోతున్న రామలక్ష్మిని స్థానిక రైతులు కొందరు గమనించి రక్షించారు.అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలు రామలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని... బాధితురాలికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.

Related Posts