హైద్రాబాద్, సెప్టెంబర్ 29,
సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూనే… పార్టీ పరంగా విపక్షాలపై కౌంటర్లు వేస్తోంది. సోషల్ మీడియాపై యువనేత కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.పార్టీ నేతలంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి వేదికలపై చురుగ్గా కనిపిస్తున్నారు. తమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రజలకు తెలియజేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ అకౌంట్ల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నారు.గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు వీలుగా పోస్టులను పెడుతున్నారు. కేంద్రం వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో అందుకు తగ్గట్టుగా అధికార పార్టీ నేతలు ఆయా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పావులు కదుపుతున్నారట. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ కొత్త కొత్త పోస్టులు దర్శనమిస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ ప్రచారాన్ని మొదలు పెట్టారు గులాబి పార్టీ నేతలు.రాష్ట్రంలో బీజేపీ నేతలను పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్న గులాబి పార్టీ.. సోషల్ మీడియా ద్వారానే కమలనాథులకు బ్రేకులు వేసేందుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు. మరోపక్క, గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలికి ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. వార్డుల పునర్విభజన చేయాలని ముందుగా భావించినా సమయాభావం ఆ ఆలోచనను విరమించుకుందని అంటున్నారు. పునర్విభజన మొదలుపెడితే ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికల నిర్వహణ కష్టమేనని భావిస్తోంది.ఎన్నికలు మార్చిలో నిర్వహించేందుకు రెడీ అయితేనే వార్డుల పునర్విభజన చేయాలని అనుకుంటోంది. గతంలో గ్రేటర్ ఎన్నికలకు ఇన్చార్జ్గా వ్యవహరించిన కేటీఆర్ ఈసారి కూడా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కొన్ని రోజులుగా గ్రేటర్లోని నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు కేటీఆర్. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న దానిపై ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి మంత్రి ఈటల రాజేందర్, అంబర్పేట నియోజకవర్గానికి మంత్రి నిరంజన్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గానికి జగదీశ్ రెడ్డి బాధ్యులుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. గ్రేటర్లో పట్టు పెంచుకోవాలని బీజేపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.అదే సమయంలో ఎన్నికల కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో కూడా సర్కార్ ఉందంటున్నారు. మరి ఈ వ్యూహాలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో?