హైద్రాబాద్, నవంబర్ 29
నవంబరు రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశముందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఈరోజు కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రెండో వారంలో ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగరంలోని 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని సర్వేలో తేలిందన్నారు. వారి పనితీరును మార్చుకోవాలని సూచించారు. కార్పొరేటర్లకు ఏమైనా సమస్యలుంటే సంబంధి ఎమ్మెల్యేలను కలవాలని కేటీఆర్ కోరారు.గత ఐదు ఏళ్లుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రగతి నివేదిక గత ఐదు ఏళ్లలో తమ పని తీరుకి నిదర్శనంగా ఉండబోతుందన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని గుర్తుచేశారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు