హైదరాబాద్ సెప్టెంబర్ 29
జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కే తారకరామారావు మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేసి, , లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ కు రప్పించిన ప్రభుత్వం మాది. గత ఐదు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిందని గుర్తు చేసారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి చేసిన కార్యక్రమాలను, పథకాలను మౌలిక వసతులకు, సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని, ఒకచోట చేకూర్చి "ప్రగతి నివేదిక" విడుదల చేస్తాం. ఈ ప్రగతి నివేదిక గత ఐదు సంవత్సరాల్లో తమ పనితీరుకి నిదర్శనంగా ఉండబోతుందని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని కార్పొరేటర్ లకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తుల పైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారు. స్థిరాస్తుల పైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్న మంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలి. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని అన్నారు.