హైద్రాబాద్, సెప్టెంబర్ 30
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీనియర్ నేత అద్వానీ సహా 32 మందికి ఇవాళ లక్నోలోని సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందన్నారు. బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోందని, ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయం భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అన్నారు. ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని, చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు అసదుద్దీన్ తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉండెనని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.
తీర్పు హస్యా స్పదం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యంగ్యంగా స్పందించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు 28 ఏండ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందరూ ఈ రోజు వచ్చిన సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పుతో నిర్దోషులుగా మారారని ఎద్దేవా చేశారు. వాళ్లంతా నిర్దోషులైతే బాబ్రీ మసీదు దాన్నదే కూలగొట్టుకుందని ట్విట్టర్ ద్వారా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ విషయంలో సీబీఐ న్యాయస్థానం తీర్పు పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ తీర్పు సిగ్గుచేటు అని ఏచూరి మండిపడ్డారు.