న్యూఢిల్లీ, అక్టోబరు 1
హత్రాస్లో గ్యాంగ్ రేప్కు గురై మృతిచెందిన యువతిని యూపీ పోలీసులు రెండు రోజుల క్రితం అర్థరాత్రి రహస్యంగా దహనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్రులను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వెళ్లారు. వాహనాల్లో వెళ్లాలనుకున్న ఆ ఇద్దర్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు కాలినడకలో హత్రాస్ దిశగా పయనం అయ్యారు. ఢిల్లీ-యూపీ హైవేపై రాహుల్ కాలిబట పట్టారు. ఆ సమయంలో పోలీసులు తనను నెట్టివేసినట్లు రాహుల్ ఆరోపించారు. తనపై లాఠీచార్జ్ కూడా చేసినట్లు ఆయన ఆరోపించారు. తనను నేలపై పడేసినట్లు రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నానని, కేవలం మోదీజీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అని ఆయన నిలదీశారు. మా వాహనాలను అడ్డుకోవడం వల్ల నడక ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. హత్రాస్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ వాహనాన్ని నిలిపేశారు. అయితే వాహనాలు దిగిన రాహుల్, ప్రియాంకాలు.. వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్కు కాలినడకన వెళ్తున్నారు. సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన హత్రాస్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గడ్డి కోసేందుకు తల్లి, సోదరుడితో పొలం వెళ్లిన ఆ అమ్మాయి ఆచూకీ లేకుండాపోయింది. తీవ్రగాయాలపాలైన స్థితిలో సెప్టెంబరు 22న ఆమెను గుర్తించారు.ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆ అభాగ్యురాలి నాలుక కోసేసి, నడుం విరగ్గొట్టి అత్యంత హేయంగా ప్రవర్తించిన వైనం అందరినీ కలచివేసింది. అత్యాచార బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కిరాతకులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ యూపీ సర్కారుకు, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కాగా, మృతురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటీన జరిపించిన నేపథ్యంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి