హైద్రాబాద్, అక్టోబరు 3,
యూపీ లోని హత్రస్ ఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడైన రాహుల్ గాంధీ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఏకంగా పాదయాత్ర చేసుకుంటూ హత్రస్ బాధితురాలి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లిన ఘటన ప్రజలందరి కంట్లో పడింది.
ఆయన వ్యాఖ్యలు కూడా ఈసారి బీజేపీ మీద చాలా కఠినంగా ఉంటున్నాయి. గాంధీ జయంతి రోజున చేసిన ట్వీట్ లో కూడా అదే రేంజిలో ఉన్నాయి. తాను ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడనని గాంధీ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఏ విధమైన అన్యాయానికీ తాను తలవంచనని చెప్పారు. అసత్యాలను సత్యానికి ఉన్న శక్తితో జయిస్తానని పేర్కొన్నారు. అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తాను ఎదుర్కొంటానని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
బీజేపీ తనను హత్రస్ హత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లనివ్వకుండా చేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రజల్లో కాంగ్రెస్ మీద తిరిగి నమ్మకం తీసుకుని రావాలనే విధంగా ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ప్లస్ అవుతుంది. కేడర్ ఉన్నా.. నాయకత్వ లోటు కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న పాజిటివ్ ఒపీనియన్ ను తెలంగాణ కాంగ్రెస్ కూడా తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ రాబోయే నెలల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండగా.. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఏర్పడుతున్న మంచి అభిప్రాయాన్ని ఓట్లుగా మలచుకోవాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా హత్రస్ ఘటనపై నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు.