హైదరాబాద్ అక్టోబర్ 4,
పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేస్తారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, కేంద్రం తీరు, రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. సరైన అవగాహన, చైతన్యం లేక అనేకమంది గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంలేదు. వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా టీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించనున్నారు.ఇప్పటి వరకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ రామచంద్రరావు కొనసాగారు. వారి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా మొదలైంది.