హైద్రాబాద్, అక్టోబరు 4,
నాలుగేళ్ల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నయీం కేసులో నిందితులుగా ఉన్న 25 మంది పోలీసు ఉన్నతాధికారులకు క్లీన్ చిట్ వచ్చింది. ఈ పోలీసులందరికీ నయీమ్తో సంబంధం ఉందని, సెటిల్మెంట్లకు సహకరించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సిట్ అధికారులు విచారణ జరిపి సదరు పోలీసు అధికారులందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.గ్యాంగ్స్టర్ నయీం చనిపోయిన అనేక ఏళ్లు గడిచిపోయాయి. అతడి మరణం తరువాత అతడి అనుచరులపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. అతడి నేరాలకు సహకరించిన పోలీసులు అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. నయీంకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వారిలో డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సంస్థకు పోలీసు ఇందుకు సంబంధించిన సమాచారం ఇచ్చింది.నయీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆరోపణలు వచ్చిన అధికారులపై విచారణ జరిపిన సిట్.. ఈ కేసులో వారి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. ఈ జాబితాలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు ఉన్నారు. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్లకు క్లీన్ చిట్ ఇచ్చిన సిట్ డీఎస్పీలు సీహెచ్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్ ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతన్నలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సీఐలు రవికిరణ్రెడ్డి, బలవంతయ్య, నరేందర్ గౌడ్, రవీందర్లకు కూడా సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.2016 ఆగస్టు 8న షాద్నగర్ సమీపంలో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎన్కౌంటర్లో నయీం చనిపోయిన ఆ తర్వాత.. అతడి చీకటి సామ్రాజ్యపు కోటలు బద్ధలయ్యాయి. నయీమ్ దందాలు.. దారుణాలు.. దారుణాలు ఒక్కొకటిగా బయటకురావడం మొదలైంది. ముఖ్యంగా అప్పటి వరకు నయీమ్కి బయపడి తన గురించి కానీ, తన దందాలు గురించి కాని బయటకు చెప్పటానికి ఇష్టపడిన వాళ్లంతా ఒక్కొకరుగా బయటకు వచ్చారు. నయీమ్ తమను ఎలా బెదిరించారో పోలీసులుకు చెప్పడం మొదలు పెట్టారు. అలా బాధితుల సంఖ్య పెరుగడంతో నయీమ్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. నయీం బాధితుల్లో చాలా మంది పెద్ద వాళ్లు, ప్రముఖులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతడికి రాజకీయ నేతలు, పోలీసుల అండదండలున్నాయనే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే నయీమ్తో సంబంధమున్న ఐదుగురు అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.దర్యాప్తులో నయీమ్కు ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీమ్కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. వివిధ ప్రాంతాల్లో 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు ఉన్నాయి. వీటితోపాటు 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు