YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అంతర్జాతీయ కుట్ర... ?

అంతర్జాతీయ కుట్ర... ?

లక్నో, అక్టోబరు 7
సంచలనం సృష్టించిన హాథ్రాస్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో మనీ లాండరింగ్ కోణం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘనటపై నమోదు చేసిన 19 ఎఫ్‌ఐఆర్‌లలో ఒక దాంట్లో మనీ  లాండరింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడానికి అంతర్జాతీయంగా కుట్ర జరిగిందని పేర్కొన్నారు. కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి  రూ.50 లక్షల నిధులు సమకూర్చారని.. ఆ మొత్తాన్ని బాధితురాలి కుటుంబసభ్యులకు ఆశజూపి వారితో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.  తాజా ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోందని, దర్యాప్తు చేసి.. మనీ లాండరింగ్ కేసు నమోదు చేయొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరిగినట్లు అనుమానాలున్నాయని తెలిపారు.అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌‌కు కూడా దీనితో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనుంది. రూ.51 కోట్ల ఎగుమతి ఆదాయాన్ని పొందారనే ఆరోపణలతో ఆమ్నెస్టీతో సంబంధం ఉన్న ఒక ప్రైవేట్ సంస్థపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు గతవారం ప్రభుత్వ
వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆమ్నెస్టీ సంస్థ కూడా ప్రకటన చేసింది.భారత ప్రభుత్వంపై ఆమ్నెస్టీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వం కావాలనే తమ ఖాతాలను స్తంభింపజేసిందని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తమను వేటాడుతోందని పేర్కొంది. ఈ అంశంపై వివాదం నడుస్తుంగానే.. హాథ్రస్ ఘటనలో మనీ లాండరింగ్ కోణం వెలుగులోకి రావడం గమనార్హం.
హాథ్రాస్‌లో ఏం జరిగింది?
ఢిల్లీకి 200 కి.మీ. దూరంలోని హాథ్రాస్ గ్రామానికి (ఉత్తర్ ప్రదేశ్) చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న తన తల్లి, సోదరుడితో కలిసి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. కాసేపటి తర్వాత సోదరుడు గడ్డిమోపుతో ఇంటికి తిరిగి వెళ్లిపోగా.. తల్లీకుమార్తెలిద్దరూ దూరం దూరంగా గడ్డి కోస్తున్నారు. కొంత సేపటి తర్వాత తల్లి వెనక్కి తిరిగి చూడగా తన కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె.. కుమార్తె కోసం ఆ పరిసరాల్లో గాలించింది. సమీపంలోని గడ్డి పొదల్లో ఓ చోట ఆ యువతి నగ్నంగా, రక్తపు మడుగులో, తీవ్ర గాయాలతో, నాలుక కొంత భాగం తెగిపోయిన స్థితిలో కనిపించింది.కుటుంబసభ్యులు బాధిత యువతిని వెంటనే అలీఘడ్‌లోని జవహర్‌ లాల్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం (సెప్టెంబర్ 29) ఉదయం కన్నుమూసింది. ఉన్నత కులాలకు చెందిన నలుగురు వ్యక్తులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని
కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

Related Posts