తెలంగాణలోని సాగుభూమిలో 60 శాతానికి సాగునీరందించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం క్లైమాక్సు దశకు చేరుకుంటున్నది. ఈ ప్రాజెక్టు లింక్ 1 పనుల పూర్తికి గాను దాదాపు వంద రోజులే మిగిలి ఉన్నందున వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తూ చర్యలు తీసుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో 209 కిలోమీటర్ల పొడవునా సొరంగం,1531 కిలోమీటర్ల పొడవుతో గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల పొడవు ప్రెజర్ కెనాల్ పనులు వాయువేగంతో సాగుతున్నాయి.
.ఒకే రోజు 7 వేల క్యూబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీటు పనులను పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పినట్టు ఎల్ అండ్ టి సంస్థ చైర్మన్ ప్రకటించారు. అయితే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, పంపు హౌజ్ లు, టన్నెల్స్ లోనూ అన్ని చోట్ల ఏకకాలంలో పనులు అదే వేగంతో జరుతుండడం విశేషం. కాళేశ్వరం ద్వారా మొత్తం 15 జిల్లాల్లో 37 లక్షల ఎకరాలకు సాగునీటితో మేలు జరగనుంది. హైదరాబాద్ జంటనగరాలకు ఈ వర్షాకాలం నుంచే ఎల్లంపల్లి ద్వారా తాగునీటి సరఫరాకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న కొండపోచమ్మ సాగర్, రంగనాయకి సాగర్ పథకాలు కూడా వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.