పట్టభద్రుల ఓటు హక్కు నమోదు ఎలా
హైద్రాబాద్,
ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలు ఒక నియోజకవర్గం, హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలను మరో నియోజకవర్గంగా విభజించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఆయా పార్టీలు బలపరిచిన ప్రధాన అభ్యర్థులను తమ ఓటు హక్కుతో ఎన్నుకోనున్నారు. అయితే పట్టభద్రల కోటాలో జరిగే ఎన్నికకు ఎవరు అర్హులు, అనర్హులు అనేదానిపై ఇప్పటికీ కొంతమందిలో సందేహాలు మొదలుతున్నాయి. అర్హులంతా ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తాజాగా ఎన్నికల సంఘం కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఓటు హక్కు ఎలా నమోదు చేసుకోవాలి అనేదానిపై ఈసీ గతంలోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది నవంబర్ నాటికి డిగ్రీ పాస్ అయ్యి మూడేళ్లు పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. కనుక 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తై ఉన్నవాళ్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటరుగా నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా అధికారులను నియమిస్తున్నారు. అర్హులైన వారు వారి వద్ద నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, డిగ్రీ పట్టాతో పాటు మరికొన్ని ఇతర పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్లైన్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఎన్నికల సంఘం కల్పించింది.ఆన్లైన్లో ఫారం 18ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని భర్తీ చేసిన అనంతరం రెండు ద్రువపత్రాలు స్కాన్చేసి అప్లోడ్ చేయాలి. దీనికి నవంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంది. డిసెంబర్ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకున్న వారుసైతం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శంశక్ గోయల్ తెలిపారు. దీంతో పాతవారు సైతం మరోసారి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరముంది.