హైదరాబాద్ అక్టోబర్ 9
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం కంటే ముందే.. మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖధపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగుపై చర్చించనున్నారు. గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.‘‘ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం నాడు సమావేశంలో ఈ విషయంపై కూడా విస్త్రతంగా చర్చ జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కరొనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తారు.‘‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగింది. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు అందుకే వర్షా కాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.