YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క‌ర్నూలులో పైలెట్ శిక్షణా కేంద్రం

క‌ర్నూలులో పైలెట్ శిక్షణా కేంద్రం

క‌ర్నూలు,అక్టోబ‌రు 10, 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పడబోతోంది. రాష్ట్రంలో మొట్టమొదటి పైలెట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలు ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రణాళికలను రూపొందించింది. కర్నూలు విమానాశ్రయాన్ని దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతుల కోసం చూస్తున్నామని  కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.కర్నూలు ప్రాంతం హైదరాబాద్ తో పాటు బెంగళూరు విమానాశ్రయాలకు దగ్గరగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ విమానయాన సలహాదారు, ఏపీఏడీసీఎల్ (ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఎండీ భరత్ రెడ్డి వెల్లడించారు.ట్రయినింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బిడ్లను పిలవాలని.. శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ సంస్థే స్వయంగా కల్పించుకోవాల్సి వుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఎయిర్ పోర్టు భూమిని వాడుకుంటున్నందుకు అద్దె కూడా కట్టాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర అనుమతులు లభిస్తే, ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులకు ట్రూజెట్, తక్కువ టికెట్ ధరలతో మూడు సర్వీసులు ప్రారంభిస్తుందని భరత్ రెడ్డి తెలిపారు. తొలి దశలో పగటి పూట మాత్రమే  సర్వీసులు నడుస్తాయని అన్నారు. కర్నూలు విమానాశ్రయం అన్ని ప్రాంతాలకు అతి దగ్గరలో ఉంది. అటు తెలంగాణకు.. ఇటు కర్ణాటక రాష్ట్రానికి కర్నూలు అతి దగ్గరలో ఉండడంతో రాబోయే కాలంలో విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2 కిలోమీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్ వే సిద్ధమైందని, మొత్తం 970  ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంది. రాబోయే కాలంలో కర్నూలు ఎయిర్ పోర్టును మరింత మెరుగు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది.  

Related Posts