YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

భారత్‌తో కలిసి ఇజ్రాయెల్ న‌యా కిట్....

 భారత్‌తో కలిసి ఇజ్రాయెల్  న‌యా కిట్....

న్యూఢిల్లీ,అక్టోబ‌రు 10,

చైనాలో పుట్టిన కరోనా వైరస్ సుమారు 10 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్న వేళ వేగంగా, కచ్చితంగా పరీక్షలు నిర్వహించడం ద్వారానే బాధితులకు సత్వర చికిత్స అందించడానికి వీలవుతుంది. ఈ దిశగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కొవిడ్-19 టెస్టులు సాధ్యమైనంత సులభంగా నిర్వహించే కొత్త విధానాన్ని ఆవిష్కరించడానికి, వ్యాక్సిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరంగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌తో కలిసి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సరికొత్త టెస్టును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.ఈ కొత్త టెస్టు ద్వారా కేవలం 30 సెకన్లలోనే ఫలితం రానుంది. అంతేకాదు.. పరీక్ష చేయడం చాలా ఈజీ. ఇందులో భాగంగా ఓపెన్ ప్రదేశాల్లో ఓ ట్యూబ్‌ లాంటి పరికరం ఏర్పాటు చేస్తారు. వ్యక్తులు ఆ ట్యూబ్‌లో ఊదాల్సి ఉంటుంది. అలా ఊదగానే.. కేవలం 30 నుంచి 50 సెకన్లలో కరోనా ఫలితం వస్తుంది. అంటే శాంపిల్ సేకరించడం, భద్రపరిచి పరీక్షా కేంద్రానికి రవాణా చేయడం లాంటి ప్రక్రియలేవీ లేకుండానే వెంటనే ఫలితం వస్తుందన్నమాట. అంతేకాదు, ప్రస్తుతం ముక్కు ద్వారా శాంపిల్ సేకరిస్తున్న ప్రక్రియలో కొన్నిసార్లు బాధితులకు నొప్పి కలుగున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొత్త పరీక్ష విధానం అందుబాటులోకి వస్తే ఉపశమనం కలుగుతుంది.ఓపెన్ స్కై’ పేరుతో పిలిచే ఈ పరిజ్ఞానం ద్వారా కరోనా పరీక్షలను తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నిర్వహించడానికి వీలవుతుందని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తెలిపారు. కరోనా పరీక్షల్లో ఇదొక గేమ్ ఛేంజర్‌గా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. రోజుల వ్యవధిలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. ‘అత్యంత వేగంగా వైరస్‌ను గుర్తించగలిగే ఈ విధానం అందుబాటులోకి రావడం ప్రపంచం మొత్తానికి శుభవార్త’ అని రాన్ పేర్కొన్నారు.ఇప్పటికే ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ను గుర్తించగలుగుతున్నారు. అయితే, తాజాగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో నిమిషంలోపే వైరస్‌ను నిర్ధారించవచ్చు. భారత్‌-ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి రూపొందించిన ఈ నూతన విధానం ప్రయోగాల్లో తుది దశకు చేరుకుంది. 2 నుంచి 3 వారాల్లో ఇది అందుబాటులోకి రానుంది’ అని రాన్ మాల్కా తెలిపారు.ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి కూడా భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తారని రాన్ మాల్కా తెలిపారు. అంతేకాదు.. కరోనా కొత్త టెస్ట్ కిట్ ప్రయోగాలు విజయవంతమైతే.. భారత్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో కలిసి ఈ టెస్టింగ్ కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడమం తమ అభిమతమని స్పష్టం చేశారు.

Related Posts