తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి... వారం రోజులుగా సూర్యుడి ప్రతాపానికి జనాలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలయితే చాలు భానుడి భగభగలు మొదలవ్వడంతో... రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఏపీలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. కోస్తాంధ్రలోని ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాయలసీమలోని తిరుపతి, అనంతపురం, కర్నూలు, చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ విషయానికొస్తే... ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మిగిలి జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఎండలను దృష్టిలో పెట్టుకొని జనాలు డా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.