ముంబై, అక్టోబరు 12,
ముంబయి మహానగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది పౌరులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ముంబయి, థానే, నవీ ముంబయి సహా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తును సరఫరా చేసే లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పలుసార్లు ట్రిప్పింగ్ కావడంతో ముంబై, శివారు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని, పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గ్రిడ్లో సాంకేతిక లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచినట్టు తెలుస్తోంది.టాటా పవర్స్ వైఫల్యంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని బృహణ ముంబయి విద్యుత్, సరఫరా విభాగం అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో లోకల్ ట్రెయిన్ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముంబయి నగరంలో ప్రజా రవాణాపై ఎక్కువ మంది ఆధారపడతారు. కార్యాలయాలకు లోకల్ ట్రెయిన్స్లో వెళ్లొస్తారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల అనేక మంది రైలు పట్టాల వెంబడి నడిచివెళుతున్నారు.జలు ఈ ఉదయం నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముంబైకి విద్యుత్ ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని, మరికాసేపట్లో సమస్య పరిష్కారం కావచ్చని అధికారులు వెల్లడించారు.ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య ఏర్పడిందని, ఎన్నో విభాగాలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.ఇదిలావుండగా, టాటాల తరువాత ముంబైకి అత్యధిక విద్యుత్ ను సరఫరా చేస్తున్న అదానీ ఎలక్ట్రిసిటీ స్పందించింది. ప్రస్తుతం అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరాను తాము పునరుద్ధరించామని, ప్రజలు సహనంతో ఉండాలని కోరింది. కాగా, విద్యుత్ నిలిచిపోగానే, వేలాది మంది సామాజిక మాధ్యమాల్లో తమ కామెంట్లు పెట్టారు. ప్రభుత్వం విఫలమైందని, ఆర్థిక రాజధానిలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరి ఇంట్లోనైనా కరెంట్ ఉందా? అని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.