YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో సీబీఐ నామ‌జపం

ఏపీలో సీబీఐ నామ‌జపం

విజ‌య‌వాడ‌‌, అక్టోబ‌రు 13, 
సీబీఐ. ఇపుడు అతి పెద్ద రాజకీయ ఆయుధం అయిపోయింది. అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా అవసరం అయిన సాధనం అయిపోయింది. ఏ చిన్న సంఘటన జరిగినా సీబీఐ విచారణ జరిపించాలని సులువుగా చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఇక జగన్ సైతం కొన్ని విషయాల్లొ రాజకీయ ఎత్తుగడల కోసం సీబీఐ అంటున్నారు. ఇలా సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థతో ఏపీలో రాజకీయ దాగుడుమూతలు ఆడేస్తున్నారు. దాంతో ఇక్కడ అసలు విషయం పక్కదారి పడుతోంది. ఎక్కడలేని కక్షలు కార్పణ్యాలు బయటకు వస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరమైన పరిణామమే.జగన్ కి అమరావతి రాజధానుల భూముల దందా మీద అనుమానాలు చాలా ఉన్నాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని కూడా గట్టిగా నమ్ముతున్నారు. పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయని ఆరోపణలు చేస్తున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి భూముల మీదనే పడ్డారు. ఒక రాజధానిని మూడు చేయడం వెనక కూడా ఇదే విషయం ఉంది. దాంతో సీబీఐ అని జగన్ సర్కార్ గట్టిగానే డిసైడ్ అయింది. ఈ విషయంలో కేంద్రం మీద వత్తిడి కూడా తీసుకువస్తున్నారు. ఒకవేళ విచారణ జరిగితే జరగవచ్చు, జరగకనూ పోవచ్చు. కానీ సీబీఐ దర్యాప్తు అన్నది జగన్ కచ్చితమైన పట్టుదలగా ఇక్కడ చూడాలి.రాజకీయాల్లో ఉండే సౌలభ్యమే ఇది. ఎవరికి ఎలా కావాలంటే అలా రాజకీయ బంతిని విసురుకోవచ్చు. అమరావతి రాజధాని మీద సీబీఐ అన్నారు కాబట్టి జగన్ డ్రీమ్ సిటీ విశాఖ మీద కూడా సీబీఐ పడాల్సిందేనని అంటున్నారు తమ్ముళ్ళు. విశాఖ నిండా భూములు కబ్జాకు గురి అయ్యాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు బలమైన వాదన ముందుకు తెస్తున్నారు. చిత్తశుధ్ధి ఉంటే ముందు విశాఖ భూ దందా మీద సీబీఐ వేయండి అని కూడా ఎగదోస్తున్నారు. విశాఖలో ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములు కబ్జా జరిగినట్లుగా లెక్కలతో సహా తీసి మరీ అయ్యన్న చెప్పుకొస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది. మరి అయిదేళ్ళ పాటు ఏపీలో టీడీపీ సర్కార్ ఉంది. నాడు విశాఖలో భూ కబ్జాలు జరిగాయని మీడియా కోడై కూసినా కూడా సిట్ విచారణను తూతూమంత్రంగా జరిపించి ఊరుకున్నారు. ఇపుడు మాత్రం సీబీఐ విచారణ కావాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. ఆనాడు విపక్షాలు అన్నీ కూడా సీబీఐ వేయండని అడిగినా చంద్రబాబు ఒక్క లేఖ కూడా కేంద్రానికి రాయలేదు. పైగా సిట్ విచారణ నివేదికను ఈ రోజుకు కూడా బయటపెట్టలేదు. మరి ఇదేం చిత్తశుద్ధి అని వైసీపీ నేతలు అడుగుతున్నారంటే అర్ధముందిగా. అంటే అమరావతి మీద సీబీఐ అని మీరు అంటే మేము విశాఖ మీద నోరు విప్పుతామని పంతంతో చెప్పడమన్నమాట. అంతే తప్ప భూ దందాలు జరిగాయి, న్యాయం చేయాలన్న ధ్యాస అసలు లేదన్న మాట. ఆ మాటకు వస్తే విభజన తరువాత ఏపీలోని టూ టైర్, త్రీ టైర్ సిటీలన్నింటిలోనూ భూ దందాలు జరిగాయి. కానీ విశాఖలో మాత్రమే సీబీఐ ఎందుకంటే ఇది రాజధానిగా జగన్ ప్రకటించారు. కాబట్టి కంపు కొట్టించాలి అన్నదే విధానంగా ఉందిగా. మొత్తం మీద వైసీపీ, టీడీపీ రాజకీయాల మధ్య సీబీఐ సైతం ఇరకాటంలో పడుతోందిగా.

Related Posts