హైదరాబాద్ అక్టోబర్ 13
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన శాసనసభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. కేవలం చట్ట సవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు - 2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020కు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.