హైద్రాబాద్, అక్టోబరు 19
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మంత్రి సూచించారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్తో పాటు కేసీఆర్ కిట్పై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లో కేంద్రమే రూ.1600 ఇస్తుందని, రాష్ర్టం కేవలం రూ. 400 ఇస్తున్నట్లు చెబుతున్నారు. బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు తేల్చిచెప్పారు. ఇవన్నీ నిజమే అయితే.. చర్చకు సిద్ధంగా ఉండాలని బండి సంజయ్కు హరీష్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక పాత బస్టాండ్ వద్ద ప్రజల మధ్యే చర్చ పెడుదామన్నారు. ఒక వేళ బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 పెన్షన్లు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఒక వేళ నిరూపించకపోతే బండి సంజయ్ అదే పాత బస్టాండ్ వద్ద ముక్కు నేలకు రాస్తాడా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. దీనికి సిద్ధమనుకుంటే.. బీజేపీ నాయకులే తేదీని డిసైడ్ చేయాలన్నారు. అబద్దపు పునాదుల మీద రాజకీయాలు చేస్తామంటే డిపాజిట్ గల్లంతు అవడం తప్ప సాధించేదేమీ ఉండదు అని మంత్రి అన్నారు. అబద్దాలు చెప్పడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎదుటి పార్టీల మీద బట్ట కాల్చి మీద వేయడం సరికాదు. దుబ్బాక ప్రజలు వాస్తవాలను గమనించాలి. లెక్క లేకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. హుజుర్నగర్లో అబద్దాలు చెప్పినందుకే బీజేపీ అభ్యర్థిని నాలుగో స్థానంలో నిలబెట్టారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నారు. పచ్చి అబద్దాలు చెబుతున్న బీజేపీ నాయకులకు దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక ప్రజలు బీజేపీ నేతలను క్షమించరు అని చెప్పారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేయాలి. కానీ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టొద్దు అని మంత్రి సూచించారు.