ఈ ఓటింగ్ దిశగా అడుగులు
హైద్రాబాద్, నవంబర్ 3,
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా ఈ-ఓటింగ్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, వృద్ధులు, కరోనాతో క్వారంటైన్లో ఉన్న వారికి ఈ-ఓటింగ్ విధానంలో ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పేర్కొన్నారు. ఈ-ఓటింగ్ విధానంపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు చర్చించినట్లు తెలిపారు.సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో పలువురు నడువలేని స్థితిలో ఉంటుండగా.. కుటుంబ సభ్యులు వాహనాలలో తీసుకురావడం, ఎత్తుకొని రావడం కష్టంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ సోకిన, వారు కలిసిన వారంతా క్వారంటైన్లో ఉంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటింగ్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. వృద్ధులతో పాటు క్వారంటైన్లో ఉన్న వారంతా తాము ఉన్న ప్రాంతం నుంచే ఈ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వీలు కలుగనుంది. అలాగే పోలింగ్లో పాల్గొనే సిబ్బంది కోసం ప్రస్తుతం ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ ఓటింగ్ విధానం అమలులోకి వస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నవంబర్ 12వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు ఎస్ఈసీ తెలిపింది.