కమలంతో గ్రేటర్ ఎన్నికల్లో కుస్తీనా..మస్తీనా
హైద్రాబాద్, నవంబర్ 4,
జనసేన, బీజేపీ జట్టుకట్టి ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం అది సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరుపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని భావించారు. కానీ పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకుండానే ఎన్నికలు ముగిసిపోయాయి. బీజేపీ నేతలు ప్రచారానికి పిలిచిని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.ఇక త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ భావిస్తుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందు కూడా తన ప్రతిపాదనను ఉంచింది. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే ఒంటరిగా వెళ్లేకంటే బీజేపీతో కలసి ఎన్నికల్లో ముందుకు వెళ్లడం మంచిదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమాయత్తమయింది. జిల్లాల వారీగా విభజించి మొత్తం ఆరుగురిని బాధ్యులుగా నియమించింది. ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండటంలో ఆ పార్టీతో కలసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.అయితే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పదే పదే పొగుడుతుండటం బీజేపీకి రుచించడం లేదు. తాజాగా కూడా వరద బాధితులకు విరాళాలను ప్రకటించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రొయాక్టివ్ సీఎంగా పొగిడారు. పవన్ కల్యాణ్ కేసీఆర్ ను ప్రశసించడమే తప్ప ఇంతవరకూ విమర్శించలేదు. కనీసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలోనూ పవన్ కల్యాణ్ కేసీఆర్ పై ఏమాత్రం విమర్శలు చేయలేదు. దీంతో బీజేపీ మరోసారి పవన్ కల్యాణ్ తో సమావేశమై పొత్తుల విషయమై చర్చించే అవకావముందంటున్నారు