జీహెచ్ఎంసీ ఇటీవల ప్రవేశపెట్టిన ప్లాగింగ్ కార్యక్రమం నగరంలో ఉద్యమ రూపంలో కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాకర్లు తాము వాకింగ్ చేస్తూనే ఆయా ప్రదేశాలు, ప్లేగ్రౌండ్లు, రహదారులల్లో ఉండే ఖాళీ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్లు, కూల్డ్రింక్ బాటిళ్లను తొలగించే ప్లాగింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. నగరంలో ప్రతిరోజు కనీసం 50 పార్కుల్లో ఈ ప్లాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, జోనల్, డిప్యూటి కమిషనర్లు మెడికల్ ఆఫీసర్లు సంబంధిత ప్రాంతాల్లో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మార్నింగ్ వాకర్లు, పార్కుల నిర్వహణ కమిటి సభ్యులను భాగస్వామ్యం చేస్తూ పార్కుల్లో వృథాగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తూ స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ నేడు ఉదయం బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కులో స్వయంగా ప్లాగింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కులో మార్నింగ్ వాకర్స్తో కలిసి వ్యర్థాల తొలగించారు. పాశ్చ్యత దేశాల్లోని పలు నగరాల్లో *ప్లాగింగ్* అనే పేరుతో ఈ విధమైన కార్యక్రమం అమలులో ఉంది. ఇదే మాదిరి హైదరాబాద్ నగరవాసుల్లోనూ తాము మార్నింగ్ వాకింగ్ చేస్తూ బహిరంగంగా కనిపించే ప్లాస్టిక్ బాటిళ్లు, కూల్డ్రింక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను ఏరివేసి నిర్థారిత ప్రదేశాల్లో వేసే అలవాటును కల్పించాలని చర్యలు చేపట్టింది. పరిసరాల పరిశుభ్రత తమవంతు బాధ్యతాయుతంగా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలిపారు.