రిటైర్డ్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా పనిచేసిన ఎం.కమల్ నాయుడు (79) బుధవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. రక్షణ రంగంలో పనిచేస్తున్నవారు కాకుండా, సివిల్ వ్యక్తిగా శౌర్యచక్ర అవార్డును దేశ చరిత్రలోనే మొదటి సారి అందుకున్న వ్యక్తిగా అరుదైన రికార్డును సొంత చేసుకున్న వ్యక్తి కమల్ నాయుడు. సుదీర్ఘ కాలం అటవీ శాఖలో ఆయన సేవలు అందించారు. కేంద్ర హోమ్ శాఖకు సంబంధించిన సుప్రీం కోర్డు కమిషన్ లో మెంబర్ గానూ సేవలు అందించారు. 1995 – 1996 మధ్య కాలంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లాలో అక్రమంగా సాగుచేస్తున్నఅటవీ భూమిని కాపాడే ప్రయత్నంలో 1972లో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 1986లో ఢిల్లీ జూ డైరెక్టర్ గా పనిచేసే సమయంలో నాగుపాము కాటుకు గురయ్యారు. కమల్ నాయుడు అంత్యక్రియలు గురువారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని ఆయన కుంటుంబ సభ్యులు తెలిపారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు పృధ్వీరాజ్, రఘువీర్, మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, హైదరబాద్ డీఎఫ్ఓ శివయ్యలు కమల్ నాయుడు ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.