మహారాష్ట్ర ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ తన చేతుల్లోకి ప్రభుత్వం తీసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ విఫలమయ్యాయి. బీజేపీకి కనుచూపు మేరలో ఆ
అవకాశం దక్కకపోవచ్చు. దీనికి కారణం మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కార్ బలంగా ఉందని అంటున్నారు. మూడు పార్టీల మధ్య విభేదాలు లేవని చెబుతున్నారు. పెద్దన్న పాత్రను శరద్ పవార్
పోషిస్తుండటంతో ఇప్పట్లో బీజేపీ కల నెరవేరదన్నది పొలిటికల్ సర్కిళ్లలో విన్పిస్తున్న మాట.మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలసి పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధించినా శివసేనకు ముఖ్యమంత్రి
పదవి దక్కకపోవడంతో వేరుకుంపటి పెట్టుకున్నారు. శరద్ పవార్ చాణ్యంతో ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
గత ఏడాది నవంబరు 28వ తేదీన ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయి దాదాపు ఏడాది అవుతుంది.కానీ ఉద్ధవ్ థాక్రే
తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు పాలన అనుభవం లేదు. దీంతో అంతా శరద్ పవార్ నడిపిస్తున్నారని , ఆయన వెనకనుంచి ఇస్తున్న ఆదేశాలను ఉద్ధవ్ థాక్రే అమలు చేస్తున్నారని
ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. దీంతో దాచిపెట్టాల్సిన అంశాలు ఏవీ లేవని, అనుభజ్ఞులైన నేతల సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి తీసుకుంటారని, అందులో తప్పేముందని శివసేన నేతలు
ఎదురు ప్రశ్నిస్తున్నారు.అయితే మహారాష్ట్రలో ఏ పనికావాలన్నా శరద్ పవార్ చెబితేనే అవుతుందంటున్నారు. పారిశ్రామికవేత్తలు సయితం ఉద్ధవ్ ను కాదని శరద్ పవార్ వద్దకు క్యూకడుతున్నారు.
లాక్ డౌన్ నిబంధలను ఎత్తివేయడంలో ఉద్ధవ్ కు ఇష్టం లేకపోయినా శరద్ పవార్ వత్తిడితోనే ఆదేశాలు ఇచ్చారంటారు. తాజాగా బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ కూడా ఇదే రకమైన ఆరోపణ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శరద్ పవార్ నడిపిస్తున్నారని విమర్శించారు. ఎవరు నడిపిించినా ఉద్ధవ్ మాత్రం తాను కోరుకున్న సీటు దక్కింది. దానిని కాపాడే బాధ్యతను ఆయన శరద్ పవార్ పై
పెట్టినట్లుంది. అందుకే మూడు పార్టీల మధ్య శరద్ పవార్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారంటారు.