YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కొడుకును చంపిన తండ్రి

కొడుకును చంపిన తండ్రి

కన్నతండ్రే కొడుకుని కిరాతకంగా చంపేశాడు. కళ్లలో కారంకొట్టి కర్రతో తలపై బాది అత్యంత దారుణంగా హత్య చేశాడు. శవాన్ని పొలాల్లోకి తీసుకెళ్లి సైలెంట్‌గా బూడిద చేసి చేతులు దులుపుకున్నాడు. కానీ.. చేసిన పాపం ఊరికేపోదన్నట్లు కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు. కొడుకుని హత్య చేసిన విషయం ఆనోటాఈనోటా పాకి వీఆర్వో చెవికి చేరడంతో.. ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయడం.. వారు సీన్‌లోకి ఎంటరవడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ పరిధిలోని బసిరెడ్డిపల్లెకి చెందిన కన్నెబోయిన చిన్న సుబ్బయ్యకి ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు రమేష్ హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సొంతూరికి వచ్చేశాడు. మద్యానికి బానిసైన తండ్రి చినసుబ్బయ్య రోజూ తాగొచ్చి తల్లి కోటమ్మని కొడుతుండేవాడు. అది చూసి ఆగ్రహం చెందిన రమేష్ తండ్రిని నిలదీశాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.గత నెల 20 వ తేదీన తండ్రి చిన్నసుబ్బయ్య మద్యం తాగొచ్చి కొడుకు రమేష్‌తో గొడవపడ్డాడు. కోపంతో ఇంట్లోకి వెళ్లి నీళ్లలో కారం కలిపి తెచ్చి కొడుకు రమేష్ కళ్లలో కొట్టాడు. అనంతరం మిద్దెపైకెక్కి కళ్లు మండుతూ అక్కడే నిల్చున్న రమేష్‌పై ఇటుకరాయి విసిరాడు. అది తగిలి రక్తస్రావం అవుతుండడంతో వరుసకు బాబాయి అయిన సుబ్బయ్య ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయినా వదలని చిన్నసుబ్బయ్య వెనక నుంచి వచ్చి కర్రతో తలపై బలంగా కొట్టడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.క్షణికావేశంలో కన్నకొడుకుని కిరాతకంగా చంపేశాడు. అనంతరం హత్య విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు శవాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మిగిలిన ఇద్దరు కొడుకుల సాయంతో రమేష్ మృతదేహాన్ని పొలాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. సాక్ష్యం దొరక్కుండా బూడిద చేసి చేతులు దులుపుకున్నాడు. అయితే ఆ విషయం జనం ద్వారా వీఆర్వోకి తెలియడంతో ఆయన వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తండ్రి చిన్నసుబ్బయ్యతోపాటు అతనికి సహకరించిన కుమారులను అరెస్టు చేసి జైలుకి పంపించారు.

Related Posts