లేడీ అమితాబ్ విజయశాంతి కాంగ్రెస్ కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ టీపీసీసీని షేక్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ బలహీనపడింది.. బీజేపీ బలపడిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీఆర్ఎస్.. కాంగ్రెస్ బలహీనపరచడంపై ఫోకస్ చేయడంతో.. బీజేపీ ఇప్పుడు గులాబీ పార్టీకి సవాల్ విసిరే స్థాయికి వచ్చిందన్నారు విజయశాంతి. కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రానికి ముందే వచ్చి ఉంటే.. పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేదని పోస్ట్ చేశారు రాములమ్మ.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినప్పటి నుంచి రాములమ్మ రచ్చరచ్చ చేస్తోంది. పార్టీ ప్రచార కమిటీ బాధ్యురాలై ఉండి దుబ్బాక బైపోల్ లో ప్రచారానికి వెళ్లకుండా ప్రజలను ఆత్మప్రబోదానుసారం ఓటెయ్యమని కోరింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఆమెకు కాషాయ తీర్థం ఇస్తే పార్టీకి కలిసివస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ కు రాములమ్మ దూరమైనట్టేనా?
కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతిపైనే.. ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా.. తమ పార్టీలో చేర్చుకునేందుకు, ముఖ్యనేతలు ప్రయత్నాలు మొదలెట్టేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా.. విజయశాంతి ఇంటికి వెళ్లి చర్చలు జరపడటంతో రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా.. ఈ విషయంపై అప్రమత్తమయ్యారు. విజయశాంతితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ.. ఆవిడ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. కేవలం ఒక్క నాయకుడికి మాత్రమే. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వీడొద్దంటూ పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రాములమ్మ బీజేపీలో చేరుతారా ? లేదా ? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.