మధ్యప్రదేశ్లో 28 శాసనసభ స్థానాలకు ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. వీరంతా బీజేపీలో చేరడంతో 15 నెలల తర్వాత కమలనాథులు మళ్లీ మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.తత్ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 28 స్థానాలకు ఉప-ఎన్నికలు జరిగాయి. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ మెజార్టీ 116 కాగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు అవసరం. తాజా ఉప-ఎన్నికల్లో 18 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో శివరాజ్సింగ్ చౌహన్ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ లభిస్తుంది.ఒకవేళ, ఉప-ఎన్నికలు జరిగిన ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే వీలుంటుంది. 28 చోట్లకు ఎన్నికలు జరగ్గా.. 27 స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
సంబురాలు చేసుకున్న కమలం
మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీ సత్తా చాటుతున్నది. మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా 19 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. భోపాల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి శివరాజ్సింగ్, సీనియర్ నేతలు ఒకరికొకరు స్వీట్లు తినిపించకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.