బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తు ఫలితాల సరళి మారుతోంది. మొదట ఆర్జేడీ కూటమి లీడ్ లోకి రాగా.. ఇప్పుడు బీజేపీ-జేడీయూ కూటమి ఒక్కసారిగా ఆధిక్యత సాధించింది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆధిక్యత చాటుకుంటోంది. ఇందులో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముండగా.. జేడీయూకు బాగా సీట్లు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.ప్రస్తుతం మధ్యాహ్నం వరకు ఫలితాలను పరిశీలిస్తే.. ఎన్డీఏ కూటమి 130 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే దాదాపు మేజిక్ ఫిగర్ చేరుకుందన్నమాట.. అటు ఆర్జేడీ మహాకూటమి కూడా 102 చోట్ల ఆధిక్యంతో ఎన్డీఏకు తీవ్ర పోటీనిస్తోంది.బీజేపీ ఈ ఎన్నికల ఫలితాల్లో 72కుపైగా స్థానాల్లో ఆధిక్యం చాటుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించడం గమనార్హం. ఎన్డీఏ కూటమిలో జేడీయూ రెండో స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒక వేళ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినా జేడీయూ నేత నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నితీష్ ను మళ్లీ బీహార్ సీఎంగా మోడీ చేస్తాడా? లేక బీజేపీ నేతను చేస్తాడా అన్నది వేచిచూడాల్సి ఉంటుంది.