హైద్రాబాద్, నవంబర్ 13,
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని అందరూ భావించారు. కానీ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతుపట్టవు. రాజకీయ నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అందని రీతిలో కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. దీపావళి అనంతరం అంటే 15న నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. దీనికితోడు గ్రేటర్లో వరదల కారణంగా ప్రజలు ప్రభుత్వం తీరుపైనా కొంత వ్యతిరేకతతో ఉన్నారని కార్పొరేటర్లు, నిఘా విభాగాల ద్వారా కేసీఆర్కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కొంతమేర వెనక్కు తగ్గింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహాలను అర్థంచేసుకోవటం కొంత కష్టమే.తాజాగా గ్రేటర్ ఎన్నికల విషయంలోనూ ఇదే తీరును కేసీఆర్ అనుసరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో తెరాస శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. అదే క్రమంలో బీజేపీ శ్రేణులు దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పుతో గ్రేటర్లోనూ తమ సత్తాచాటుతామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్లో టీఆర్ ఎస్ పార్టీ బలంగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల ప్రభావం గ్రేటర్పై పడకుండా ఉండాలంటే ఎన్నికలను ఆలస్యం చేయొద్దని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కొలుకొనే అవకాశం ఇవ్వవద్దనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం చేసింది. వెంటనే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చి గ్రేటర్లో గత ఫలితాలను పునరావృతం చేసేలా కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. మరి కేసీఆర్ వ్యూహం గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఇస్తుందా..? లేదా అనేది వేచి చూడాల్సిందే.