భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠంగా నిజామాబాద్లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం నాడు రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. పలు నగరాల్లో వేడిగాలులు కూడా మొదలయ్యాయి. దీనిని బట్టి ఈ ఏడాది వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఎండాకాలం ముందే వచ్చేసిందని, గతంలో కన్నా తీవ్రంగా ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 28నాటికి ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రతలకన్నా 2-5 డిగ్రీల సెల్సీయస్ ఎక్కువగా నమోదైందని, ముందు ముందు అధిక వేడి పంట దిగుబడులపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ బుధవారం ఒక ప్రకటన చేసింది.నిజామాబాద్ తర్వాత రామగుండం, ఆదిలాబాద్లో 42.6 డిగ్రీలు, మహబూబ్నగర్లో 41.9, భద్రాచలంలో 41.8, ఖమ్మంలో 41 డిగ్రీలుగా రికార్డ యింది మెదక్లో 40.7, హన్మకొండలో 40.5, నల్గొండలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం గమనార్హం. ఖమ్మంలో సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే గురు, ఆదివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.