న్యూఢిల్లీ, నవంబర్16
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది డియర్నెస్ అలవెన్స్ డీఏ పెరుగుదల ఉండదని స్పష్టంగా చెప్పేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరుత్సాహపడి ఉంటారు. అయితే ఇప్పుడు వీరికి మోదీ సర్కార్ శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది.మోదీ సర్కార్ డియర్నెస్ అలవెన్స్ను పెంచాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది జూలై నెలలో డీఏ పెంపు ప్రకటన ఉండొచ్చని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మోదీ సర్కార్ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 4 శాతం పెంచే అవకాశముందని తెలిపాయి. అయితే ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయం తీసుకుంటే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలుగనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంపు ఉండదని ప్రకటన చేసింది.దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2020 జనవరి 1 నుంచి డీఏ అదనపు పేమెంట్ను అందించలేదు. అంతేకాకుండా ఆర్థిక శాఖ 2020 జూలై 1 నుంచి 2021 జనవరి 1 వరకు కూడా డీఏ, అదనపు చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. ఇంకా ఉద్యోగులకు పెరిగిన డీఏ కాకుండా పాత డీఏనే లభిస్తుంది. అంటే జూన్ నాటికి 17 శాతమే వస్తుంది.