YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంచులో చిక్కుకుపోయిన ఇద్దరు సీఎంలు

మంచులో చిక్కుకుపోయిన ఇద్దరు సీఎంలు

న్యూఢిల్లీ, నవంబర్ 16
దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌‌లు అక్కడ చిక్కుకుపోయారు. ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న 40 గదుల పర్యాటక అతిథిగృహానికి శంకుస్థాపన చేయడానికి ఇరువురూ ఆదివారం వెళ్లారు. కేదార్‌నాథ్‌లో విపరీతంగా మంచు కురువడంతో ఆ ప్రాంతం మంచు పేరుకుపోయింది. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆలయాన్ని మూసివేశారు.శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగానే ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడి నుంచి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మళ్లీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు హెలికాప్టర్ సేవలను కొనసాగించే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. కేదారీనాథ్ వెళ్లి స్వామిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. పర్యాటక అతిథిగృహానికి శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి బదరీనాథ్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లాల్సి ఉండగా.. మంచు విపరీతంగా కురువడంతో అక్కడే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత ఇరువురూ బదరీనాథ్ చేరుకుంటారు. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో కేదార్‌నాథ్‌ను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్.. టూరిజం గెస్ట్‌హౌస్ కట్టిస్తామని ప్రకటించారు.

Related Posts