హైద్రాబాద్, నవంబర్ 17
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన బరిలో దిగనున్నట్లు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు జనసేన ప్రకటించింది. తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోరు సాగనుంది. టీఆర్ఎస్-మజ్లిస్ కలిసి బరిలో దిగనుండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది.ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు. కానీ దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్.. బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన ప్రకటించడం.. బీజేపీ అభిమానుల్లో టెన్షన్కు కారణమైంది.జనసేన పోటీ చేస్తే బీజేపీతో పొట్టు పెట్టుకుంటుందా...? లేదా ఒంటరిగా బరిలో దిగుతుందా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే... తెలంగాణ ఏర్పడినందుకు అన్నం ముట్టని పవన్తో కమలం పార్టీ పొత్తు పెట్టుకుందని టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తు లేకపోతే.. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ వాసులు, ముఖ్యంగా కాపులు జనసేనకు ఓటేసే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది.దీంతో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా.. కొన్ని స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న చోట్లు బీజేపీ డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతుందనే ప్రచారమూ సాగుతోంది. పైకి పొత్తు లేకున్నా.. ఒకరికొకరు సహకరించుకునే రీతిలో ఇరు పార్టీలు లోపాయికారీగా అవగాహనకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్, టీడీపీ, జనసేన మధ్య చీలిపోయి బీజేపీకి లబ్ధి చేకూరుతుందనే వాదన ఉంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించినప్పటికీ.. నిజంగానే పోటీ చేస్తుందా..? లేదంటే వెనక్కి తగ్గే అవకాశం ఉందా..? ఒకవేళ పోటీ చేసినా.. సీఎం కేసీఆర్పై పవన్ విమర్శలు గుప్పిస్తారా..? అనేది త్వరలోనే తేలనుంది.