హైదరాబాద్, నవంబర్ 19,
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్లో చేసిన అభివృద్ధితో పాటు.. కరోనా వైరస్ సమయంలో, వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మేనిఫెస్టో విడుదల చేశారు.
మేనిఫెస్టో్లోని ముఖ్యాంశాలివే..
* త్వరలో నగరమంతా ఉచిత వైఫై ఏర్పాటు
* హైదరాబాద్లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతులు
* కొత్తగా 4 ఆడిటోరియంల నిర్మాణం
* రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్ల ఏర్పాటు
* మూసీ పునరుద్దరణ, సుందరీకరణ..
* హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక
* రూ.1,900 కోట్లతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైపులైన్
* జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ
బీజేపీపై యుద్ధం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూరుశాతం విజయం మనమే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలా అని నేతలంతా నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది. భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.