హైదరాబాద్ నవంబర్ 19
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు దివంగత సీఎం జే జయలలిత స్నేహితురాలు వీకే శశికళ .. బుధవారం రోజున సుమారు పది కోట్ల జరిమానా చెల్లించారు. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆమె తరపున న్యాయవాది వెల్లడించారు. బెంగుళూరులోని ఓ కోర్టులో ఆ జరిమానాను డిపాజిట్ చేసినట్లు న్యాయవాది రాజా సెంతూర్ పాండియన్ తెలిపారు. కోర్టు అధికారులు శశికళ చెల్లించిన జరిమానాకు సంబందించి.. జైలు అధికారులకు తెలియజేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ లోగానే శశికళను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.దీనిపై తమిళనాడు సీఎం కే పళనిస్వామి స్పందించారు. శశికళను కానీ, ఆమె కుటుంబసభ్యులను కానీ, అన్నాడీఎంకే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ చేర్చేది లేదని ఆయన అన్నారు. శశికళపై పార్టీ అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండదని సీఎం పళనిస్వామి చెప్పారు.శశికళ బంధువులు ఇద్దరు కూడా ఆమెతో పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరంతా పారప్పన్న అగ్రహారం సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే శశి బంధువుల ఫైన్ కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.