న్యూఢిల్లీ నవంబర్ 19
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న నానమ్మ ఇందిరాగాంధీ సమాధి వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. 'మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. అధికారానికి ప్ితిరూపమైన ఆమె సమర్థవంతమైన ప్రధానమంత్రి. ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతున్నది. నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయని' ట్వీట్ చేశారు.దేశానికి మొదటి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జవహర్లాల్ దంపతులకు జన్మించారు. 1942, మార్చి 26న ఫిరోజ్గాంధీని వివాహం చేసుకున్నారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 1964-66 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. దేశానికి అత్యధికకాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు ప్రధానిగా కొనసాగారు. దేశంలో 1975 నుంచి 77 వరకు రెండేండ్లపాటు అత్యవసర పరిస్థితి విధించారు. దేశంలో అనేక సంస్కరణలకు ఆధ్యంపోసిన ఆమె 1984, అక్టోబర్ 31న తన అంగరక్షకుల చేతిలో హత్యకుగురయ్యారు.