రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లు చూడాలని, బ్యాంకు మిత్రల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు.
గురువారం సచివాలయంలో రాష్ట్ర స్ధాయి ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్) యన్.శ్రీనివాసరావు, ఎస్ ఎల్ బీసీ కన్వీనర్ మణి కందన్, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రటరీ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు,బ్యాంకు మిత్రల పనితీరు, ముద్రా రుణాల పంపిణీ, ఫైనాన్షియల్ లిటరరీ క్యాంపెన్, జన్ దన్ యోజన అకౌంట్స్, రూపేరికార్డుల జారీ, బ్యాంకు ఖాతాల వివరాలు, భీమాయోజన పథకాలు తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4185 బ్యాంకు మిత్రల ద్వారా సేవలందిస్తున్నామని, వీరి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సి.యస్ కోరారు. బ్యాంకు ఖాతాల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2017-18 కి సంబంధించి 5469 కోట్ల (107 శాతం) ముద్రారుణాలను అందించామని తెలిపారు. జన్ దన్ భీమాయోజన, సురక్ష భీమాయోజన ద్వారా అందే ప్రయోజనాలను ఈ సందర్భంగా చర్చించారు. మధ్యతరహా పరిశ్రమలకు విస్తృతంగా రుణాలందేలా చూడాలన్నారు. రైతులకు, మహిళలకు ఇన్సురెన్స్ అందించే విషయమై ఇప్పటికే ఉన్న వివిధ పథకాలపై విశ్లేషణ చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను సి.యస్ కోరారు.